స్నానం చేస్తుండగా పేలిన గీజర్.. కొత్త పెళ్లికూతురి మృతి

స్నానం చేస్తుండగా గీజర్ పేలడంతో నవ వధువు మృతి చెందింది. ఉత్తర ప్రదేశ్‌, బరేలీ ప్రాంతంలోని మిర్‌గంజ్‌లో జరిగిందీ విషాదం. కాళ్ల పారాణి కూడా ఆరకముందే జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లోనూ పెను విషాదం నింపింది. బులంద్‌షహర్‌లోని కలే క నగ్లా గ్రామానికి చెందిన యువతికి ఈ నెల 22న పిపల్‌సన గ్రామానికి చెందిన దీపక్ యాదవ్‌తో వివాహం జరిగింది. ఈ క్రమంలో బుధవారం అత్తగారింట్లో స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.

సాయంత్రం స్నానం కోసం బాత్రూముకు వెళ్లిన యువతి సమయం గడుస్తున్నా బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. భర్త, కుటుంబ సభ్యులు చాలాసార్లు పిలిచినా స్పందన రాకపోవడంతో బాత్రూము తలుపులు పగలగొట్టారు. లోపల యువతి అపస్మారక స్థితిలో పడి ఉండగా, గీజర్ పేలిపోయి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గీజర్ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 

Geyser Explosion
Uttar Pradesh
Mirganj
Tragedy

More Telugu News